ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈరోజు, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏ జిల్లాల్లో హెచ్చరికలు?
ఈరోజు విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
మత్స్యకారులకు కీలక సూచనలు
అల్పపీడనం ప్రభావం దృష్ట్యా, వచ్చే ఐదు రోజులు మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోవైపు, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. ప్రస్తుత అల్పపీడనం ప్రభావం తగ్గక ముందే మరో అల్పపీడనం రావడంతో రాష్ట్రంలో తీవ్ర వర్షపాతం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.