ఏలూరు (Eluru) జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కైకలూరు (Kaikaluru) నియోజకవర్గం కలిదిండి మండలంలో, అలాగే రుద్రవరంలో దివంగత కాపు నేత (Kapu Leader) వంగవీటి మోహన్ రంగా (Vangaveeti Mohan Ranga) విగ్రహాలకు (Statues) గుర్తు తెలియని దుండగులు పేడ (Cow Dung) పూసి అవమానించారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకూ అధికారులు స్పందించలేదని కాపు నేతలు, రంగా అభిమానులు మండిపడుతున్నారు.
సీఎం చంద్రబాబు ఖండన
ఈ ఘటనపై ఇప్పటివరకు స్పందించని అధికారులు విమర్శలకు గురవుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు (Chandrababu) ఈ దుశ్చర్యను ఖండిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. రంగా విగ్రహంపై అవమానం జరిగిందనే వార్త తెలిసిన వెంటనే ఆయన వెంటనే స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విగ్రహాలపై దాడుల సిరీస్
గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాలపై దాడులు పెరిగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలు అనేకసార్లు చోటుచేసుకున్నాయి. అయితే ఆ సందర్భాల్లో పెద్దగా స్పందించని సీఎం, రంగా విగ్రహంపై దాడి జరిగితే వెంటనే స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.