ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉత్తరకాశీ (Uttarkashi) జిల్లాలో ఖీర్ (Khir) గంగా (Ganga) నది ఒక్కసారిగా ఉప్పొంగి భారీ విధ్వంసం సృష్టించింది. మంగళవారం ఉదయం హర్సిల్ (Harsil) సమీపంలోని ఖీర్ గంగా నది ఒడ్డున ఉన్న ధారాలి గ్రామంలో క్లౌడ్బర్స్ట్ (Cloudburst) కారణంగా వరదలు ముంచెత్తాయి. దీంతో 50-60 మంది గల్లంతైనట్లు అంచనా. 20-25 హోటళ్లు, హోంస్టేలు, అనేక ఇళ్లు కూలిపోగా, 10-12 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానికులు తెలిపారు.
ఖీర్ గంగా నది సృష్టించిన విపత్తుతో గ్రామంలోని దుకాణాలు, రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ ప్రశాంత్ ఆర్య (Prashant Arya) సమాచారం ప్రకారం, ఈ వరదల్లో నలుగురు మరణించినట్లు నిర్ధారణ అయింది, అయితే గల్లంతైన వారి సంఖ్య ఇంకా ఖచ్చితంగా తెలియలేదు.
పోలీసులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్), ఆర్మీ, ఇతర విపత్తు సహాయ బృందాలు వెంటనే రంగంలోకి దిగి రక్షణ, సహాయ చర్యలు చేపట్టాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సహాయ చర్యలను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆగస్టు 10 వరకు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించింది, దీంతో ప్రజలు నదులకు దూరంగా ఉండాలని, పిల్లలు, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఉత్తరకాశీ పోలీసులు సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ఉత్తరాఖండ్ వరద బీభత్సం వీడియోలు వైరల్గా మారాయి.








