ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్ర ప్రజలతో స్వచ్ఛతా ప్రమాణం చేయించడంతో పాటు, విద్యుత్, రైతు బజార్లు, మహిళల ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలపై మాట్లాడారు.
ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఈ పథకం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎన్నికల హామీలలో ఒకటైన “సూపర్ సిక్స్”లో భాగం. అయితే, ఈ పథకం అమలుకు రోజుకు రూ.4 కోట్లు, రూ.120 కోట్ల ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని అంచనాలు ఉన్నాయి. కాగా, 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి నిధుల కేటాయింపులు లేకపోయినప్పటికీ, సీఎం అమలు చేస్తామని చెప్పడం సంచలనంగా మారింది. ఈ పథకం అమలు గతేడాది దసరా ఆ తరువాత దీపావళి, ఆ తరువాత సంక్రాంతి పండుగకు అమలవుతుందన్న ప్రచారం జరిగిన నేటికీ అమలు కాకపోవడం గమనార్హం. తాజాగా ఆగస్టు 15 నుంచి అని సీఎం ప్రకటించారు.
స్వచ్ఛాంధ్ర: పరిశుభ్రతపై ప్రమాణం
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా, సీఎం చంద్రబాబు ప్రజలతో ఇళ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రమాణం చేయించారు. అక్టోబరు 2 నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి నెల మూడో శనివారం ఇళ్లు, పరిసరాల శుభ్రతపై దృష్టి పెట్టాలని ప్రజలకు సూచించారు. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం ప్రకటించారు.
రైతు బజార్ల ఆధునికీకరణ
రైతు బజార్లు రైతులకు, వినియోగదారులకు ఎంతో లబ్ధిని చేకూర్చాయని సీఎం తెలిపారు. కర్నూలులోని రైతు బజార్ను ఆధునికీకరించేందుకు రూ.6 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్య రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తుందని ఆయన అన్నారు.