లండన్లోని ఓ విద్యుత్ సబ్స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో నగరం గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ ఘటనతో వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే హీత్రో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారీ అగ్నిప్రమాదంతో విద్యుత్ సరఫరా నిలిచిన కారణంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు హీత్రో ఎయిర్పోర్టు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ప్రయాణికులు ఎయిర్పోర్టుకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ కోత కారణంగా విమానయాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అగ్నిప్రమాదం జరిగిన వెంటనే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అప్రమత్తమైన అధికారులు సమీపంలోని 150 ఇళ్లను ఖాళీ చేయించారు. దాదాపు 10 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నాయి. సంఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారికంగా వెల్లడించగా, ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.