తిరుపతిలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ ఓ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యార్థిని పాఠశాల భవనం రెండో అంతస్థుపై నుంచి మరో విద్యార్థి తోసేసిన ఘటన తిరుపతిలో కలకలం రేపింది.
పాడిపేటకు చెందిన విద్యార్థి స్నేహ తిరుపతి శ్రీచైతన్య టెక్నో స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతుంది. పాఠశాలలో స్నేహకు మరో విద్యార్థి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తోటి విద్యార్థిని స్నేహను పాఠశాల భవనం రెండో అంతస్థుపై నుంచి తోసేసింది. స్నేహకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే పాఠశాల సిబ్బంది హుటా హుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించిన యాజమాన్యం.. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా గోప్యంగా వైద్య చికిత్స అందిస్తోంది. ప్రమాద ఘటన గురించి సమాచారం అందుకున్న తిరుపతి అర్బన్ తహసీల్దార్.. ఆస్పత్రికి చేరుకొని విచారణ చేపట్టారు. అంతేకాకుండా తిరుపతి ఈస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థిని తోటి విద్యార్థిని స్కూల్ బిల్డింగ్పై నుంచి తోసివేయడం చర్చనీయాంశంగా మారింది. స్కూల్ యాజమాన్యంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.