తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. చికెన్ను తాకాలంటేనే జనం జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త మాంస ప్రియులను బెంబేలెత్తిస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అన్నానగర్లోని పలు చికెన్ సెంటర్లపై ఆకస్మిక దాడులు జరగడంతో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఆరోగ్య, ఫుడ్ సేఫ్టీ, టాస్క్ఫోర్స్ అధికారులు సంయుక్తంగా ఈ దాడులను నిర్వహించారు.
కుళ్లిన చికెన్ను స్వాధీనం
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో పలు చికెన్ షాపుల్లో 5 క్వింటాల కుళ్లిన కోడి మాంసాన్ని అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ చికెన్ను నగరంలోని అనేక వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు.
ఎలాంటి ప్రమాదం?
ఈ కుళ్లిన చికెన్ను మూడు నెలల పాటు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచేందుకు ప్రమాదకరమైన కెమికల్స్ కలుపుతారని, నిల్వ ఉంచిన చికెన్ను బార్లు, వైన్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు విక్రయిస్తారని అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా, ఫార్మలిన్ను కలిపి చికెన్ పాడవకుండా ఉంచడంపై అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఇది బర్డ్ ఫ్లూ వైరస్ కన్నా మరింత ప్రమాదకరమైన చర్యగా భావిస్తున్నారు. ఈ ఘటన తరువాత, ఈ షాపుల లైసెన్సులను రద్దు చేసి, వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.