క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ (SEBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. షేర్ మార్కెట్లో వేగవంతమైన లావాదేవీలకు T+0 సెటిల్మెంట్ విధానాన్ని మరింత విస్తరించింది. ఈ ప్రక్రియ ద్వారా లావాదేవీ జరిగిన రోజే సెటిల్మెంట్ పూర్తవుతుంది. తాజా మార్పులో 500 కంపెనీల స్టాక్స్ను ఈ విధానంలోకి చేర్చింది.
మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఎంపిక చేసిన టాప్ 500 కంపెనీలకు ఈ విధానం వర్తించనుంది. సెబీ ఆప్షనల్గా T+0 లేదా T+1 సెటిల్మెంట్ సైకిల్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దశలవారీ అమలు.. 2025లో పూర్తి సాధ్యం
సెబీ 2024 మార్చిలో 25 కంపెనీలతో T+0 సెటిల్మెంట్ను ప్రారంభించింది. 2024 డిసెంబర్ 31 నాటికి 500 కంపెనీల షేర్లు ఈ సెటిల్మెంట్ పరిధిలోకి వస్తాయి. 2025 జనవరి నుంచి ప్రతి నెల 100 కంపెనీల చొప్పున మరింత విస్తరించే ప్రణాళిక ఉంది. ఈ విధానంతో మొత్తం 525 కంపెనీల షేర్లు T+0 సెటిల్మెంట్ పరిధిలోకి చేరనున్నాయి. లావాదేవీల కోసం ఉదయం 8:45 నుంచి 9:00 గంటల మధ్య ప్రత్యేక బ్లాక్ డీల్ విండో ఏర్పాటు చేయనున్నారు.
ఐసీఈఎక్స్ మూసివేతకు సెబీ అనుమతి
ఇక మరో కీలక పరిణామంలో ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఐసీఈఎక్స్) మూసివేతకు సెబీ అనుమతి ఇచ్చింది. 2022లో స్టాక్ ఎక్స్ఛేంజీ గుర్తింపును రద్దు చేసిన తర్వాత, తాజా నిబంధనల ప్రకారం ఐసీఈఎక్స్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. గత లావాదేవీల డేటాను తొలగించి, ఆదాయపన్ను నిబంధనలను పాటించాలని ఆదేశించింది.