తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరుగురు కొత్త జడ్జీలను నియమిస్తూ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలతో రెండు రాష్ట్రాల న్యాయవ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
తెలంగాణ హైకోర్టు నూతన నియామకాలు..
తెలంగాణ హైకోర్టుకు సీనియర్ న్యాయవాదులైన రేణుకా యారా, నందికొండ నర్సింగ్ రావు, తిరుమల దేవి, మధుసూదన రావు నియమితులయ్యారు. హైదరాబాద్కి చెందిన రేణుకా యారా ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా సేవలందిస్తున్నారు. హైదరాబాద్కి చెందిన నందికొండ నర్సింగ్ రావు సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డికి చెందిన తిరుమల దేవి ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా మరియు విజిలెన్స్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు. కాజీపేటకు చెందిన మధుసూదన రావు హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా సేవలందిస్తున్నారు.
ఏపీ హైకోర్టు నియామకాలు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అవధానం హరిహరనాథ శర్మ, డా. యడవల్లి లక్ష్మణరావులు నియమితులయ్యారు. వీరి పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం ఈ నెల 11న సిఫారసు చేయగా, రాష్ట్రపతి ఆమోదించారు.








