జనసమీకరణ చేయాల్సిన అవసరం వైసీపీకి లేదని, జనం గుండెల్లో జగన్ ఉన్నారంటూ మాజీ మంత్రి విడదల రజినీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మాజీ మంత్రి విడదల రజిని, అంబటి రాంబాబు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఆమె విచారణ ఎదుర్కొన్నారు. వైయస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఆరోపణలపై పోలీసులు వారిని విచారించారు.
విచారణ అనంతరం మీడియాతో రజిని మీడియాతో మాట్లాడుతూ.. రెంటపాళ్యం జగన్ పర్యటనకు జనసమీకరణ చేశామని తమపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. అయితే, తాము జనసమీకరణ చేయలేదని, జగన్ పర్యటన ఉందని తెలిస్తే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. “జనం గుండెల్లో జగన్ ఉన్నారు. కాబట్టే జనసమీకరణ చేయాల్సిన అవసరం లేదు” అని ఆమె స్పష్టం చేశారు.
సూపర్ సిక్స్ అంటూ మాయ మాటలు
జగన్ పర్యటనకు అనేక ఆంక్షలు పెట్టారని, చంద్రబాబుకు ఏ భయం పట్టుకుందో తెలియదు కానీ, పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారని రజిని ధ్వజమెత్తారు. “సూపర్ సిక్స్ అంటూ మాయమాటలు చెప్పారని, చంద్రబాబు పాలనలో అందరూ మోసపోయామని జగన్కు ప్రజలు చెబుతున్నారు” అని ఆమె వ్యాఖ్యానించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఏడాది కాలంగా తమను వేధిస్తున్నారని ఆమె వాపోయారు.
రెడ్ బుక్ పాలన, వైసీపీ నేతలపై కేసులు
“జగన్ను సీఎం చేసేంత వరకూ వైసీపీ నేతలెవరూ భయపడరు” అని విడదల రజిని అన్నారు. రెడ్ బుక్ గురించి చంద్రబాబు, లోకేష్ ప్రచారం చేశారని, ఇప్పుడు రెడ్ బుక్ ప్రకారమే పాలన చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డిపై కూడా తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని, జగన్ చుట్టూ ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలని చూస్తున్నారని విడదల రజిని వ్యాఖ్యానించారు.








