ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ఓ ప్రకటన తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చురేపింది. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు చంద్రబాబు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ఇటీవల ప్రకటించడమే కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు లేవని అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లడంతో తెలంగాణ అభ్యంతరాలను ఏపీ చీఫ్ సెక్రటరీకి పంపించాలని ఆదేశించారు. అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై కూడా చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణపైన పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీమ్తో నివేదిక తయారు చేయించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని కూడా ఆదేశించారు. 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎం రేవంత్కు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటి పారుదల శాఖ) ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు.







