ఉమ్మడి రాష్ట్ర విభజన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అదే తప్పిదాలు జరుగుతున్నాయని ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ జి. హరగోపాల్ అభిప్రాయపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. రాయలసీమకు నీటి ప్రాధాన్యత, పరిశ్రమల అభివృద్ధి, విద్యా అవకాశాలు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని, మహారాష్ట్ర విదర్భ తరహాలో ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు కోసం పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
అభివృద్ధి కేంద్రీకరణ వల్ల జరిగే నష్టం
అమరావతిలో మాత్రమే అభివృద్ధి కేంద్రీకరించడం వల్ల సమగ్ర అభివృద్ధి సాధ్యమవదని చెప్పారు. ఒక ప్రాంతానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇతర ప్రాంతాలు మరింత వెనుకబడి పోతాయని హరగోపాల్ హెచ్చరించారు. ఇటీవల విభజనతో ఏర్పడిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే విధానాలు అవసరమని ఆయన సూచించారు.
రాయలసీమ కోసం వైఎస్సార్ కృషి..
నదీ జలాలను రాయలసీమకు మళ్లించడానికి వైఎస్సార్ చేసిన కృషిని గుర్తుచేస్తూ, కృష్ణా జలాల పంపిణీ పునర్నిర్ణయం చేయడానికి వచ్చిన ఒత్తిడులను ఆయన ఎలా ఎదుర్కొన్నారో ప్రస్తావించారు. అభివృద్ధి కోసం కొన్ని త్యాగాలు అవసరమని, సమగ్ర అభివృద్ధి దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందని హరగోపాల్ అభిప్రాయపడ్డారు.








